
ఏ ముహూర్తాన బిగ్బాస్ రెండవ సీజన్ను మొదలుపెట్టారో కానీ సీజన్ ఆరంభం నుంచి అంతమయ్యే వరకు బుల్లితెరపై ఎన్నో వివాదాలు,విమర్శలు,ఆరోపణలకు కేంద్రబిందువుగా నిలిచింది.హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా కంటెస్టంట్ల మధ్య పరస్పర ఆరోపణలు,వాగ్వాదాలు జరిగాయి.ఇంటి లోపల, బయట కూడా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు,ఆరోపణలు చేసుకున్నారు.జనాలు కూడా బిగ్బాస్ మేనియా నుంచి బయటకు రావడంతో కంటెస్టంట్లు కూడా తమ తమ పనుల్లో బిజి అయ్యారు.అయితే తాజాగా కౌశల్ తాము అనుకున్నంత మంచివాడు కాదంటూ కౌశల్ ఆర్మీ సభ్యులు ఆరోపణలు, విమర్శలు చేయడంతో మరోసారి బిగ్బాస్ ప్రసార మాధ్యమాల్లో రచ్చకెక్కింది.తనపై వచ్చిన ఆరోపణలపై కౌశల్ స్పందించారు. నేను ఎవరికీ ట్రోల్ చేయమని చెప్పలేదు. నన్ను నమ్ముకుని కౌశల్ ఆర్మీలో ఉన్న అమ్మాయిలను బూతులు తిడితే.. వారికి తగిన సమాధానం ఇవ్వాలని మాత్రమే చెప్పాను. రోల్ రైడా వీడియో పెట్టినపుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఓ అమ్మాయి కామెంట్ పెడితే ఆమెను కొందరు బూతులు తిడుతూ కామెంట్ పెట్టారన్నారు.

దీంతో అమ్మాయిని తిట్టిన వ్యక్తులను సమాధానం చెప్పండి అని మాత్రమే కోరానని కౌశల్ వివరణ ఇచ్చారు. ఓ టీవీ ఛానల్లో నేను మాట్లాడిన ఆడియో క్లిప్ వినిపించి నేను అందరినీ ట్రోల్స్ చేసే విధంగా రెచ్చగొడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరినీ రెచ్చగొట్టలేదు. ఎవరైతే అమ్మాయిలను బూతులు తిట్టారో వారికి సమాధానం చెప్పాలని కోరాను. బూతులు తిట్టిన వారిపై ఆల్రెడీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫిబ్రవరి 19, 2019న ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. త్వరలోనే అన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు.బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక తన ఇంటికి వచ్చిన సోమిశెట్టి హరికృష్ణ అనే వ్యక్తి మీకు అభిమానని పరిచయం చేసుకొని మీతో సినిమా తీయాలనుకుంటున్నానని చెప్పాడన్నారు.మూడు నెలల అనంతరం హఠాత్తుగా తాను డబ్బులు మొత్తం స్థలాలపై పెట్టుబడిగా పెట్టానని ఇప్పట్లో సినిమా తీయలేనని చేతులెత్తేసాడన్నారు. తనీష్ నటించిన కొత్త చిత్రానికి ఫైనాన్స్ వేరే వారిచేత ఇప్పిస్తున్నాను అని చెప్పారన్నారు. అలా చెప్పడానికి వారం ముందే ఆయన నాకు 9.5 లక్షల చెక్ ఇచ్చారని కౌశల్ చెప్పుకొచ్చారు. నేను ఈ సందర్భంగా తనీష్కు థాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నపుడే… కౌశల్ బయటకు రా కొడతాం… బయటకు రా నేనేంటో చూపిస్తా అన్నాడు. ఆయన బిగ్ బాస్ ఇంట్లో చెప్పింది ఇపుడు చేస్తున్నాడు. ఇలా కుట్రలు చేసి నా మీద గెలిచాడు. అందుకు అతడిని అభినందిస్తున్నాన్నారు.నాతో సినిమా చేస్తాను అనే వారికి ఫోన్ చేసి, నాకు వ్యతిరేకంగా ఉన్నవారిని, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని కూడబెట్టుకుని, నా మీద ఇన్ని చేయిస్తున్నారు. నాకు సినిమా అవకాశం కూడా లేకుండా చేశాడు. తనీస్ నిజంగా గ్రేట్. నన్ను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నందుకు థాంక్యూ సోమచ్.

బాబు గోగినేని గారు యూకెలో ఉండి మాట్లాడటం కాదు. ఇండియా వచ్చి మాట్లాడండి. మీరు మా ఆర్మీని పెయిడ్ ఆర్మీ అని ఆరోపణలు చేయడం కాదు, ప్రూఫ్స్ చూపించండి. నేను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడే నా కోసం వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాంటి వారిని పెయిడ్ ఆర్మీని ఎలా అంటారు. మీరు నా దగ్గరికి రాక పోయినా మిమ్మల్ని వెతుక్కుంటూ ఆస్ట్రేలియా వచ్చాను. అక్కడ ధైర్యంగా డిబేట్ పెట్టించాను. అక్కడే మీరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని నిరూపించాను. బాబు గోగినేని ఇండియాలో అరెస్ట్ వారెంట్లు ఉండటంతో విజయ్ మాల్యా మాదిరిగా యూకె వెళ్లారు. దమ్ముంటే ఇండియా రండి. ఇక్కడ ఎన్ని డిబేట్లకైనా నేను రెడీ. మీకు కొన్ని టీవీ ఛానల్స్ చాలా క్లోజ్ అవ్వొచ్చు. మీరు ఎన్ని ఎలిగేషన్స్ చేసినా ఏమీ పీకలేరు. తేజస్వి మదివాడ, దీప్తి సునైనా.. వీరంతా ఇన్నాళ్లు ఏమైపోయారు? ఇపుడు ఓ టీవీ ఛానల్లో నా మీద ఆరోపణలు రాగానే తెరపైకి వచ్చారు. నిజంగా నామీద మీకు అన్ని ఎలిగేషన్స్ ఉంటే, నా వల్ల అన్ని సమస్యలు ఉంటే ఎందుకు ఇంతకాలం కామ్గా కూర్చున్నారు. ఇన్ని రోజులు నేనేంటో తెలియదా? బిగ్ బాస్ ఇంట్లో ఏం చేశానో తెలియదా? నేను అంత దుర్మారుడిగిని అయితే ఎందుకు సైలెంటుగా ఉన్నారని కౌశల్ ప్రశ్నించారు. కౌశల్ ఆర్మీ పేరుతో ఓ పది మంది వచ్చి టీవీ ఛానల్స్ లో మాట్లాడితే నమ్మేస్తారా? ఇదంతా తనీష్, తేజస్వి, బాబు గోగినేని కలిసి చేస్తున్నదే. అంతా సిండికేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లోనే నన్ను స్పాయిల్ చేయాలని చూశారు. అక్కడ ఏం జరిగిందో ప్రజలు చూశారు. తేజస్వి మాదివాడ మా ఆర్మీని పట్టుకుని గొర్రెలు అంటోంది.. అలా అనడానికి ఆమెకు ఏం హక్కు ఉంది? అని కౌశల్ ప్రశ్నించారు.