న్యూఢిల్లీ : తమ నిరసనల అణచివేతకు రైల్వేశాఖ పలు రైలు సర్వీసులను రద్దు చేసి, కొన్నింటిని మళ్లించిందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు సుఖ్ దేవ్ సింగ్ కొక్రికలాన్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలోని భటిండా, మాన్సా, ఫిరోజ్ పూర్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి వస్తుండగా రైళ్లను సరిహద్దుల్లోనే నిలిపివేశారని సుఖ్ దేవ్ సింగ్ చెప్పారు. రైళ్లను రద్దు చేయడం, దారిమళ్లించటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఆందోళన కోసం అన్నదాతలు ట్రాక్టర్లు, బస్సులు,ట్రాలీలు, టెంపోల్లో తరలివస్తున్నారని వివరించారు.వెయ్యి మంది రైతులు రైలులో ఢిల్లీకి వస్తుండగా టిక్రి సరిహద్దుకు నాలుగు కిమీల దూరంలోని బహదూర్ ఘడ్ వద్ద దించివేశారని చెప్పారు. గంగానగర్-ఓల్డ్ ఢిల్లీ రైలును కూడా బహదూర్ గఢ్ వద్ద నిలిపివేశారు. ముంబై సెంట్రల్ నుంచి వచ్చే అమృత్ సర్ స్పెషల్ రైలును జనవరి 13 నుంచి దారి మళ్లించారు.దర్బంగా-అమృత్ సర్ స్పెషల్ రైలు కూడా రద్దు చేశారు.