
అమరావతి: మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసును తప్పు దారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి గురువారం ఇక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే. ద్వివేదికి ఫిర్యాదు చేసారు.సాక్షాత్తు ముఖ్యమంత్రే విచారణను తప్పు దారి పట్టించే విధంగా వాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు విచారణాధికారుల్ని ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆక్రోశించారు. వివేకా హత్య కేసును నిష్పాక్షికంగా విచారించి అసలు దోషులకు శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. తన తండ్రి హత్యపై పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తా పత్రికల కత్తరింపుల్ని వారు ద్వివేదికి సమర్పించారు.