పవన్‌ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఆగ్రహం

పవన్‌ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఆగ్రహం

విజయవాడ : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపైనా, డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌పైనా సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా? లోకేష్‌ రెడ్‌ బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ‘నా కూతుర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఎనిమిది సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నాను. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసును పవన్‌ కల్యాణ్‌ గాలికి వదిలేశారు. మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్‌పైనే అని అన్నారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసెంబ్లీ సమావేశాల్లో నా కూతురు కేసుపై చర్చించాలి. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సిబిఐ విచారణ జరిపించాలి.  నా కూతురుకి మాత్రం న్యాయం చేయలేకపోయారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితకు శ్రీకాంత్‌ పెరవలిపై ఉన్న దృష్టి నా కూతురు విషయంలో లేదు. ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో ఉన్న ఆత్రుత నా కూతురు విషయంలో లేదు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా? ఎందుకు ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోయారని మంత్రి అనితను అడుగుతున్నాను. గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తాను. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై డిజిటల్‌ క్యాంపెయిన్‌ చేస్తాం. నిరాహార దీక్షకు కూడా పూనుకుంటాం. ఎనిమిది సంవత్సరాలు అవిటితనంతో పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించదా? లోకేష్‌ రెడ్‌ బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు… అధికారంలోకి వచ్చాక ఎందుకు గుర్తులేదు? జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం’ అని పార్వతి అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos