చెన్నై: ప్రపంచ సౌందర్యాన్ని చూడకపోవటమే ప్రధాని నరేంద్ర మోదీ కోపానికి కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. చెన్నై, స్టెల్లా మేరిస్ కళాశాల విద్యార్థినులతో బుధవారం ఆయన ముఖాముఖీలో పాల్గొన్నారు. విద్యార్థినులు ప్రశ్నలకు చాలా ప్రశాంతంగా బదులిచ్చారు. నిరుడు లోక్సభలో జరిగిన విశ్వాస తీర్మానం చర్చలో పాల్గొన్న తర్వాత రాహుల్ ప్రధాని మోదీని ఆలింగనం చేసుకోవటాన్ని ఓ విద్యార్థిని ప్రశ్నించారు. ‘అన్ని మతాలకు పునాది ప్రేమ. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ, జైన, సిక్కు మతాలన్నింటి పరమావధి ప్రేమ. ‘ప్రధాని పట్ల నా కెలాంటి రాగ ద్వేషాల్లేవు. ఆయన తన ప్రసంగంలో నాపై, కాంగ్రెస్పై చాలా కోపాన్ని మా నాన్న (రాజీవ్ గాంధీ), అమ్మ (సోనియాగాంధీ) చాలా ఘోరమైన వ్యక్తులన్న తరహాలో ఆయన మాట్లాడారు. నా మనసులో మాత్రం ఆయనపై అభిమానం ఉంది. ప్రపంచ సౌందర్యాన్ని ఆయన చూడలేకపోతున్నారనే అనే భావం కలిగింది. అందువల్లే ఆయన కోపంగా ఉన్నారని అనిపించింది. కనీసం నావైపు నుంచైనా ఆయనపై ప్రేమ చూపించాలని అనుకున్నాను. అందుకే ఆలింగనం చేసుకున్నాన’ని విపుల్లీకరించారు. ‘ప్రేమను పొందలేని వారు ఇతరులను ప్రేమించ లేరు. కారణం ఏమైనా ఆయనలో ప్రేమ లేకపోవడం దురదృ ష్టకరం. అందువల్లే ఆయన ఆగ్రహం చూపించారు.నేను మాత్రం ఆయన పట్ల సహజ ప్రేమనే చూపించాన’ని విశదీకరించారు. ‘ఆయన కోపాన్ని ప్రదర్శించినా, కోపంగా బదులివ్వరాదని ఆయన నుంచే నేర్చుకున్నాన’ని చెప్పారు. ‘విషయాలపై అవగాహన కల్పించే వ్యక్తులను మీరు అసహ్యించు కుంటారా? లేదు కదా. నిన్ను విమర్శించేవాళ్లే నీకు బోధకులు. విమర్శలకు విమర్శలతోనే సమాధానమివ్వకూడదు. వాళ్లూ ద్వేషించి నువ్వూ ద్వేషిస్తే మీరు నేర్చుకునేది ఏమీ ఉండదు. మిమ్మల్ని ఎదుటి వాళ్లు ద్వేషిస్తే వారిని మీరు ఆలింగనం చేసుకోండి. తద్వారా మీరు చాలా నేర్చుకున్నవాళ్లవుతారు’ అని విద్యార్థులకు హితవు చెప్పారు.