న్యూ ఢిల్లీ: న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ కరోనా చికిత్స పొందుతూ శుక్రవారం ఇక్కడ మరణించారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సంతాపాన్ని తెలిపారు. 1930లో ముంబైలో జన్మించిన సోలీ సొరాబ్జీ, 1953లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవనాన్ని ఆరంభించారు. 1971లో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఆపై 1989 నుంచి 90 మధ్య, 1998 నుంచి 2004 వరకూ భారత అటార్నీ జనరల్ గా పని చేసారు. మానహ హక్కుల పరిరక్షణకు తనవంతు కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2002లో పద్మ విభూషణ్ తో సత్కరించింది.