న్యూ ఢిల్లీ: తమ ఆక్సిజన్ అవసరాలు చాలా వరకు తగ్గిపోయినందున మిగిలిన ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాలకూ ఇస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ బెడ్లు ఖాళీ అవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు. 15 రోజుల క్రితం వరకు రోజూ 700 టన్నుల వరకు ఆక్సిజన్ అవసరం అయిందని, ఇప్పుడది 582 టన్నులకు తగ్గిందని వివరించారు. ఇదే విషయమై కేంద్రానికి లేఖ రాసామన్నారు. ఆపత్కాలంలో ఆదుకున్న కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ హైకోర్టుకు సిసోడియా కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీలో నిన్న 10,400 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 21 శాతం మేర తగ్గాయి. పాజిటివిటీ రేటు కూడా 14 శాతానికి పడిందని వివరించారు.