విజయవాడ : దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి .స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఏపీసీసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని షర్మిల ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎంతో మంది త్యాగాల ఫలితం మనకు సిద్ధించిన స్వాతంత్ర్యమన్నారు. మహనీయులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు తెలుపుతున్నామన్నారు. గత 10ఏళ్లుగా బీజేపీ ఈ దేశంలో అధికారంలో ఉందన్నారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది, ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు.బీజేపీ మతతత్వ పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అరాచకాలను 10 ఏళ్లుగా చూస్తున్నామన్నారు. హర్ ఘర్ తిరంగ అని మోడీ ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టారన్నారు. దేశ భక్తి ఉన్నట్లు బీజేపీ సర్టిఫై చేస్తుందట అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని, జాతీయ జెండాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవమానించిందన్నారు. మూడు రంగుల జెండాను గౌరవించం అని చెప్పిందన్నారు. 2001 వరకు ఆర్ఎస్ఎస్ పార్టీ ఆఫీస్లో జాతీయ జెండాను ఎగరవేయలేదన్నారు. నిజానికి ఈ దేశానికి మోడీ చేసింది ఏమీ లేదన్నారు. హర్ గర్ను మోడీ మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అని మోసం చేశారన్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని మోసం చేశారని.. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం అని మోసం చేశారని విమర్శలు గుప్పించారు. మణిపూర్లో ఊచ కోత కోశారన్నారు. ఆంధ్రలో కూడా ప్రతి ఘర్ను మోసం చేశారన్నారు.