పుణె : భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 275 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఓవర్నైట్ స్కోరు 36/3తో ఇన్నింగ్స్ను ఆరంభించిన సఫారీ సేన 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన క్వింటన్ డికాక్ (31)తో కలిసి దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ (64, 117 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్) ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరినీ అశ్విన్ పెవిలియన్కు పంపించడంతో సఫారీ సేన మరోసారి కష్టాల్లో పడింది. ఈ దశలో కేశవ్ మహారాజ్ (72, 128 బంతుల్లో 12 ఫోర్లు), ఫిలాండర్ (44 నాటౌట్, 177 బంతుల్లో 6 ఫోర్లు) పోరాట పటిమను కనబరిచారు. వీరిద్దరూ కలిసి తొమ్మిదో వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మహారాజ్ను అశ్విన్ బోల్తా కొట్టించడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. మూడో రోజు ఆఖరి ఓవర్లో రబాడ (2)ను కూడా అశ్విన్ పెవిలియన్కు పంపించడంతో భారత్కు భారీ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో అశ్విన్ (4/69), ఉమేశ్ యాదవ్ (3/37) రాణించారు. ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టిన అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై 50 వికెట్లు సాధించిన భారత నాలుగో బౌలర్గా రికార్డు సృష్టించాడు. అనిల్ కుంబ్లే (84), శ్రీనాథ్ (64), హర్భజన్ సింగ్ (60) గతంలో ఈ ఘనతను సాధించారు.