తెలంగాణ ఆర్టీసీకి ఇప్పట్లో లాభాల యోగం పట్టేట్లు లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.650 కోట్లు దాటుతాయని అంచనా. తొలి తొమ్మిది నెలలకు రూ.531 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆర్టీసీకి పాలక వర్గం లేదు. ఎండీ కూడా లేరు. నిర్వహణ లోపం వల్లే ఆర్టీసీ నష్టాల బాట వీడడం లేదని సమాచారం. ఏయేటికాఏడు నష్టాల్లో మునిగిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 75 శాతం నష్టాలు నమోదవుతున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు సంస్థకు ఆర్థికంగా చేయూతనందిస్తే తప్ప, ఈ పరిస్థితిలో మార్పు రాదని, దీనిపై ప్రభుత్వం నియమించిన కమిటీయే స్పష్టం చేసింది.
`