పాట్నా: ప్రతిపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యేలు హెల్మెట్లు ధరించి, ప్రథమ చికిత్స పెట్టెలు పట్టుకుని సోమవారం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. ‘అసెంబ్లీలోనే మమ్మల్ని చంపేయడానికి మార్చి 23న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గూండాలను రప్పించారు. ఆ ఘటనలో కేవలం పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసి వదిలేయడం సరికాదు’ అని ఆర్జేడీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ అన్నారు. తమకు మరోసారి గాయాలు కాకుండా ఉండేందుకే తగిన ఏర్పాట్లు చేసుకుని వచ్చామని వివరించారు. మార్చి 23న బీహార్ అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. అప్పుడు సభలోకి పోలీసులు ప్రవేశించటాన్ని ఆర్జేడీ అప్పట్లో ఆక్షేపించింది. తమ ఎమ్మెల్యేలు కొందరికి గాయాలయ్యాయని చెప్పింది.