న్యూ ఢిల్లీ : దేశంలో బియ్యం ధరలు ఎగబాకడంతో వీటి లభ్యతను పెంచి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరిట కిలో బియ్యాన్ని రూ. 29కి విక్రయించాలని నిర్ణయించింది. సబ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఎన్సీసీఎఫ్) కేంద్రీయ భండార్ అవుట్లెట్ల ద్వారా విక్రయించనున్నట్టు సమాచారం. దీనిపై ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడుతుందని సీనియర్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమపిండి, పప్పుధాన్యాలను భారత్ ఆటా, భారత్ దాల్ పేరుతో తక్కువధరలకే అందిస్తోంది. నవంబర్లో తృణ ధాన్యాల ధరలు పది శాతం పైగా ఎగబాకడంతో ఆహార ద్రవ్యోల్బణం 8.7 శాతానికి పెరిగింది.ద్రవ్యోల్బణం కట్టడికి, దేశంలో బియ్యం లభ్యతను పెంచేందుకు కేంద్రం భారత్ రైస్ పేరిట సబ్సిడీ ధరకే బియ్యం అందించాలని నిర్ణయించింది. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.