అన్ని చిత్ర పరిశ్రమలతో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తికి ఎట్టకేలకు బెయిల్ లభించింది.డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు కలిగి ఉందనే ఆరోపణలతో గత నెల 8 వ తేదీన అరెస్టై జైలు జీవితం గడుపుతున్న రియాకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.తన బెయిల్ పిటిషన్ లో, సుశాంత్ సింగ్, తనకు అలవాటైన డ్రగ్స్ కోసం సన్నిహితులను సంప్రదించేవాడని, ఆ కారణంతోనే తాను, తన సోదరుడు నార్కోటిక్స్ అధికారులకు టార్గెట్ గా మారామని వాపోయారు. సుశాంత్ కు బైపోలార్ డిజార్డర్ ఉందని, అతన్ని కుటుంబీకులు దూరం పెట్టారని, ఆ డిప్రెషన్ లోనే, మానసిక అనిశ్చితికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని, తనకేమీ సంబంధం లేదని ఆమె వాదించింది.తనపై నార్కోటిక్స్ అధికారులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎన్నడూ డ్రగ్స్ వాడలేదని కోర్టుకు తెలుపుతూ, తనకు బెయిల్ ను మంజూరు చేయాలని కోరుకున్నారు. ఆమె వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బెయిల్ ను మంజూరు చేశారు.రియాకు జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 20 వరకూ పొడిగిస్తూ, స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజునే హైకోర్టు బెయిల్ ను మంజూరు చేయడం గమనార్హం.ఇక ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న రియా సోదరుడు షోవిక్ కు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు.