న్యూఢిల్లీ: బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే మోడీని గద్దె దించుతాం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గురువారం న్యూఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ …. బీసీ రిజర్వేషన్లపై మరోసారి కేంద్రంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే మోడీని గద్దె దించుతాం అని హెచ్చరించారు. పార్లమెంట్లో బీసీ బిల్లుపై చర్చ జరగాలని కోరుతూ, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీ కోటా బిల్లులు కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నాయని అన్నారు. నాలుగు నెలలుగా రాష్ట్రపతి దగ్గర కూడా ఈ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయని… అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నా రాష్ట్రపతి ఇప్పటివరకు సమయం కేటాయించలేదు అని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 మార్గాలు ఉన్నాయన్నారు. 50 శాతం సీలింగ్పై గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో ఇవ్వాలని, జీవో ఇస్తే.. ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే ఇస్తుంది కాబట్టి మొదటి మార్గం సాధ్యం కాదు అని చెప్పారు. ఇప్పుడే స్థానిక ఎన్నికలు పెట్టకుండా ఆపడం రెండో మార్గం అని సూచించారు. వీటిని ఆపితే కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు. మూడో మార్గం పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వడం అని అన్నారు. బీసీలకు 42 శాతం సీట్లపై ఇతర పార్టీలపైనా ఒత్తిడి తెస్తాం అని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణలో కులగణన చేపట్టడం రాహుల్ గాంధీ సూచన మేరకే జరిగిందని రేవంత్ తెలిపారు. రాహుల్ గాంధీ ఆశయం ప్రకారం 42 శాతం బీసీ కోటా బిల్లు తెచ్చామన్నారు. ఈ కోటా సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు. కేంద్రం బిల్లులను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు 6వ తేదీన జంతర్ మంతర్ దగ్గర మహా ధర్నా నిర్వహించారని గుర్తు చేశారు. ఈ ధర్నాకు సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు, పార్టీలోని బీసీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు.