హైదరాబాదు: ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికల్లో మళ్లీ గెలవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘కేసీఆర్ కు చేతకావడం లేదు. అందుకే బీహార్ నుంచి ప్రశాంత్ కిశోర్ ను తెచ్చుకున్నారు. మరో 12 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది. మేము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రగతి భవన్ ను నాలెడ్జి సెంటర్ గా మారుస్తాం. మేము పెట్టే తొలి సంతకం దీనిమీదే. కాంగ్రెస్ పార్టీలో ఒక రోగం ఉంది. ఒకరు పాటను అందుకున్నప్పుడు ఇతరులు పాడరు. అందరూ ఒకేసారి పాటను అందుకోకపోవడం కాంగ్రెస్ బల హీనత. ఒకేసారి పాడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి. ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రగతి భవన్ బానిస. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాబూ మోహన్ కి ఎక్కువ, బ్రహ్మానందంకు తక్కువ. తెలంగాణ ఉద్యమం సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హరీశ్ రావు అగ్గిపెట్టె మర్చిపోయారు. కేసీఆర్ ను అధికారం నుంచి తరిమి కొడితేనే రాష్ట్ర సమస్యలు తీరుతాయ’న్నారు.