న్యూ ఢిల్లీ : సోషల్ మీడియా రీల్స్, వీడియోలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు ప్రధాన ప్రాంగణంలో ఫొటోలు దిగడం, సోషల్ మీడియా రీల్స్, వీడియోలు చేయడాన్ని నిషేధించింది. ఈ మేరకు ఈ ప్రదేశాన్ని హై సెక్యూరిటీ జోన్గా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు మీడియా ప్రతినిధులు సైతం ఇంటర్వ్యూలు, లైవ్ కోసం వారికి కేటాయించిన లో సెక్యూరిటీ జోన్ ప్రాంతాన్ని వినియోగించుకోవాలని సూచించింది. హై సెక్యూరిటీ జోన్లో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం మొబైల్ ఫోన్ వినియోగించడం నిషేధం. కెమెరాతో పాటు ట్రైపాడ్, సెల్ఫీ స్టిక్ లాంటి వస్తువులు వాడకూడదు. ముఖ్యంగా రీల్స్, వీడియోలు తీయడం నిషిద్ధం. ఒకవేళ ఈ ఆదేశాలను న్యాయవాది, పిటిషనర్లు, క్లర్క్లు, బార్ అసొసియేషన్ సభ్యులు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి. ఒకవేళ ఈ నిబంధనలను ఎవరైనా మీడియా ప్రతినిధి అతిక్రమిస్తే సుప్రీం కోర్టు ప్రధాన ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్లోకి నెల పాటు ప్రవేశం ఉండదు.ఈ నిబంధనలను ముఖ్యంగా సుప్రీ కోర్టు సిబ్బంది, రిజిస్టీ అతిక్రమిస్తే తీవ్రమైన అంశంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇతర శాఖల సిబ్బంది అతిక్రమిస్తే ఆయా శాఖల నిబంధనల ప్రకారం హెచ్ఓడీలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా వ్యక్తులు, సిబ్బంది, న్యాయవాదులు హై సెక్యూరిటీ జోన్లో ఫొటోలు తీసుకునే సమయంలో అడ్డుకునే హక్కు భద్రతా అధికారులకు ఉంటుందని చెప్పింది.