అయోధ్య : దళిత యువతిపై హత్యాచారం ఉత్తరప్రదేశ్లో దుమారం రేపుతోంది. అయోధ్య సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి గురువారం రాత్రి భాగవతం వినేందుకు ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఆమె మృతదేహాన్ని అత్యంత దారుణ స్థితిలో గ్రామ సమీపంలోని కాల్వలో గుర్తించారు. కాళ్లూచేతులు విరగ్గొట్టి, కళ్లు పీకేయడమే కాక మర్మావయాల్లో కర్ర దూర్చినట్లు తేలింది. శరీరంపై ఇతర చోట్లా తీవ్ర గాయాలున్నాయని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. యువతి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించలేదని విమర్శించారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, అది వచ్చాకే నిజానిజాలు తేలుతాయని స్థానిక పోలీసులు తెలిపారు.హత్యాచార ఘటనపై మీడియాతో మాట్లాడుతూ ఫైజాబాద్ ఎంపీ అవధేశ్ ప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘ఓ మర్యాద రామా.. ఓ సీతమ్మ తల్లీ మీరెక్కడున్నారు?’’ అంటూ రోదించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని లేదంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. లోక్సభలో విషయాన్ని లేవనెత్తుతానని, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.