తిరుమల : తనకు ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని తితిదే ఆగమ సలహాదారుగా నియమితులైన రమణ దీక్షితులు అన్నారు. తితిదే ఆగమ సలహామండలి సభ్యుడిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. గతంలో బలవంతంగా పదవీ విరమణ చేయించిన ప్రధాన అర్చకులు, అర్చకులను తిరిగి వారి స్థానాల్లో నియమించేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రమణ దీక్షితులు తెలిపారు. అందులో భాగంగానే శ్రీవారి ఆగమ సలహాదారుగా తనకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చక, అర్చక కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సౌకర్యాలు ప్రకటించారన్నారు. కనీస వేతనాలు, దూపదీప నైవేద్యాలకు కావాల్సిన నిధులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. అర్చకులంతా సీఎం జగన్కు రుణపడి ఉంటామన్నారు. సనాతన ధర్మాలను కాపాడేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.