రాయపూర్: కోవిడ్-19 కారణంగా ఖర్చులు పెరుగుతుండటంతో రాష్ట్రంలో కొత్త నిర్మాణ కార్యకలాపాలన్నిటినీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ నిలిపేశారు. కొత్త గవర్నర్ హౌస్, సీఎం హౌస్, నూతన శాసన సభ భవనాల నిర్మాణాలను కూడా నిలిపేశారు. ఇదిలావుండగా దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో నూతన పార్లమెంటు భవనంతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపేయాలని కాంగ్రెస్ తదితర పక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే డిమాండ్తో కొందరు ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఛత్తీస్గడ్లో 18-44 సంవత్సరాల మధ్య వయస్కుల్లో స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు లేనివారు కరోనా టీకా వేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీజీ టీకా వెబ్ పోర్టల్ను ప్రారంభించింది. రాష్ట్రంలో వందలాది ప్రదేశాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి, ఈ వయో వర్గంలోని వారందరికీ వ్యాక్సినేషన్ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకుంది. పంచాయతీలు, పట్టణ, పురపాలక సంఘాల స్థాయుల్లో ఈ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కోవిడ్ వ్యాక్సిన్ల కోసం దేశవ్యాప్తంగా కోవిన్ వెబ్ పోర్టల్ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీజీ టీకా వెబ్ పోర్టల్ ద్వారా టీకా కోసం నమోదు చేయించు కోవడం కోసం మొబైల్ నంబర్ అవసరం ఉండదని భూపేష్ బాఘేల్ చెప్పారు. రాష్ట్రంలో పేదలు, గ్రామీణులు ఎక్కువగా ఉన్నందు వల్ల ఈ పోర్టల్ను ప్రారంభించామని చెప్పారు.