ఢిల్లీ : దేశ రాజధానిని భారీ వర్షం అతలాకుతలం చేసింది. సోమవారం సాయంత్రం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. ఢిల్లీ-గురుగ్రామ్ జాతీయ రహదారిపై దాదాపు 20 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ తలెత్తింది. దీంతో వాహనదారులు రోడ్లపై ముందుకు కదల్లేక ఆరు గంటలపాటు నరకయాతన అనుభవించారు. హర్యానాలో నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రణాళిక లేని మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా నివాసితులు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రణదీప్ సింగ్ సుర్జేవాలా గురుగ్రామ్లో భారీ ట్రాఫిక్ జామ్కు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘2 గంటల వర్షం = 20 కిలోమీటర్ల గురుగ్రామ్ జామ్..!’ అంటూ నయాబ్ సింగ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇదీ బీజేపీ ట్రిపుల్ ఇంజిన్ మోడల్ అంటూ ఎద్దేవా చేశారు.