అమరావతి : పశ్చిమ బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు. రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డిసెంబరు 25న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టిఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. ఈ నెల 26న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఏలూరు, కృష్ణా, ఎన్టిఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 27న ప్రకాశం, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.