రాహుల్‌ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు : స్పీకర్‌కు ప్రతిపక్ష నేత లేఖ

రాహుల్‌ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు : స్పీకర్‌కు ప్రతిపక్ష నేత లేఖ

న్యూ ఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో సోమ వారం జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు.ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ తాజాగా వెల్లడించింది. స్పీకర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హిందువులు, ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, అగ్నివీర్, నీట్ పరీక్షల్లో అక్రమాలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను తొలగించినట్లు వివరించింది. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంపై రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. తన స్పీచ్ నుంచి తొలగించిన భాగాలు, వ్యాఖ్యలకు సంబంధించి లోక్సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తన ప్రసంగంలో తొలగించిన వ్యాఖ్యలను పునరుద్ధరించాలని స్పీకర్కు రాసిన లేఖలో విన్నవించారు. తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన తీరు తనకు దిగ్భ్రాంతి కలిగించిందని, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని లేఖలో రాహుల్ పేర్కొన్నారు. కాగా, లోక్సభ ప్రసంగంలో రాహుల్ వ్యాఖ్యలపై పాలక పక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా తప్పుడు సమాచారం అందించారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మండి పడ్డారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పార్లమెంట్ వేదిక కారాదని అన్నారు. లోక్సభలో నిన్న రాహుల్ అసత్యాలు వల్లె వేశారని, ఆ సమయంలో సంబంధిత మంత్రులు ఆ విషయం బయటపెట్టారని మనోజ్ తివారీ పేర్కొన్నారు. సభా వేదికపై అసత్యాలు మాట్లాడితే వాటిని రికార్డుల నుంచి తొలగించడం సభా సంప్రదాయాల్లో భాగమని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos