గౌహతి : అసోంలోని బటద్రవ ఆలయాన్ని సందర్శించుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని ఆలయ సమితి అడ్డుకుంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతిలేద న్నారు. 15వ శతాబ్దానికి చెందిన అస్సామీ సాధువు శ్రీమంట శంకరదేవ జన్మస్థలంలో నిర్మించిన ఆలయమే బటద్రవ.. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సోమవారం బటద్రవ చేరుకున్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. పార్టీ శ్రేణులతో కలిసి నడి రోడ్డుపైనే బైఠాయించారు. ఆలయంలోకి అనుమతించకుండా అడ్డుకునేంత నేరం తాను ఏం చేశానో చెప్పాలని అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. ఆలయంలో గొడవలు సృష్టించడం తమ అభిమతం కాదని, కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్లిపోతామని చెప్పినా వినిపించుకోలేదని ఆయన ఆరోపించారు. తనను లోపలికి అనుమతించ వద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతోనే ఆలయ కమిటీ అడ్డుకుందని విమర్శించారు. చివరకు ఆలయంలోకి ఎవరు వెళ్లాలి.. ఎవరు వెళ్లకూడదనేది కూడా ప్రధాని నరేంద్ర మోదీయే నిర్ణయిస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ సందర్భంగా బటద్రవలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతకుముందు ఆదివారం అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. రామ జన్మభూమిలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజు రాహుల్ గాంధీ బటద్రవకు వెళ్లకూడదని సూచించారు. దీనివల్ల ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ్ యాత్ర రూట్ మార్చుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు.