భోపాల్:హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అదృశ్యమైన నూతన జంట కేసు మిస్టరీ వీడింది. భర్త రాజ రఘువంశీని భార్య సోనమే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు. ఆమెతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ వ్యాపార కుటుంబానికి చెందిన రాజ రఘువంశీ, సోనమ్కు మే 11న పెళ్లి జరిగింది. కొత్త జంట హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. అయితే మే 23న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో కనిపించకుండా పోయారు. నాటి నుంచి మేఘాలయ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఆ జంట కోసం తీవ్రంగా గాలించగా.. రాజ రఘువంశీ మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన భార్య సోనమ్ కోసం పోలీసులు గాలింపు కొనసాగించారు.సోనమ్ ఉత్తరప్రదేశ్లోని గాజీపుర్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది .అనంతరం ఆమెను అరెస్టు చేసినట్లు మేఘాలయ డీజీపీ సోమవారం వెల్లడించారు. ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. రాజ రఘువంశీని చంపేందుకు సోనమ్ తమకు సుపారీ ఇచ్చినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.హనీమూన్ కోసం మే 20న తమ ఇంటి నుంచి బయల్దేరిన కొత్త జంట అసోం రాజధాని గువహటి మీదుగా షిల్లాంగ్ వెళ్లారు. షిల్లాంగ్ వెళ్లే ముందు గువహటిలో కామాఖ్యా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ జంట గువహటి మీదుగా షిల్లాంగ్కు ప్రయాణించి, దాదాపు 60 కి.మీ దూరంలో ఉన్న సోహ్రా (చిరాపుంజి) సందర్శించడానికి యాక్టివాను అద్దెకు తీసుకున్నారు. దట్టమైన అడవిలో ప్రయాణిస్తూ వారు ముందుకు సాగారు. మరుసటి రోజు సోహ్రారిమ్ అనే గ్రామ సమీపంలో నవ దంపతుల యాక్టివా పడి ఉంది. కానీ ఆ దంపతులు కనిపించకుండా పోయారు. మేఘాలయాలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రెండు జంటలు అదృశ్యమయ్యాయి. రాజా, సోనమ్ అదృశ్యంపై అతని తల్లి రీనా స్పందించారు. తమతో చివరిసారిగా మే 23వ తేదీన మాట్లాడినట్లు తెలిపారు. ఇక అప్పట్నుంచి వారితో మాట్లాడలేదని, కమ్యూనికేషన్ లేకుండా పోయిందని విలపించారు. మే 24వ తేదీ వరకు కూడా వారి ఫోన్లు స్విచ్ఛాఫ్గా ఉన్నాయి. దీంతో ఆందోళనకు గురై మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు, బంధువులు కలిసి సోహ్రా ప్రాంతంలో గాలింపు చేపట్టారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు.