లేటుగా వచ్చిన లేటస్ట్గా వస్తానంటూ ఓ తెలుగు చిత్రంలో హీరో చెప్పినట్లు కరోనాపై పోరాటానికి,లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలు,కార్మికులను ఆదుకోవడానికి దర్శకుడు,నటుడు రాఘవ లారెన్స్ ఆలస్యంగా స్పందించినా సంచలనం సృష్టించాడు.కరోనాపై పోరాటానికి, పేదలను ఆదుకోవడానికి తన వంతు విరాళంగా రూ.3 కోట్లు ప్రకటించారు.ఈ విరాళాన్ని ఆరు భాగాలుగా విభజించారు.తాను ఈ స్థాయికి ఎదగడానికి కారణం… డ్యాన్స్. అందుకే డ్యాన్సర్స్ యూనియన్ కి 50 లక్షలు విరాళం ఇచ్చారు. సినీ కార్మికుల సంఘానికి మరో 50 లక్షలు ప్రకటించారు. తాను నివసించే ప్రాంతంలోని వికలాంగులు – పేదల కోసం కోటి రూపాయలు కేటాయించారు. అతను రాయపురంలో నివసిస్తారు. అక్కడ పేదలకు అన్నం వసతి అందించడానికి దీనిని ఖర్చుపెట్టనున్నారు.మిగిలిన కోటి రూపాయల్లో 50 లక్షల పీఎం కేర్స్ ఫండ్ కి – మరో 50 లక్షల తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి కేటాయించారు. లారెన్స్ కేవలం విరాళం ఇచ్చి చేతులు దులుపుకోకుండా తాను స్వయంగా తన ప్రాంతంలో సేవ చేయడానికి సిద్ధమయ్యారు.ఎవరికి ఏ కష్టం వచ్చినా,దేశంలో ఎప్పుడు,ఎక్కడ విపత్తులు సంభవించినా అందరికంటే ముందుగా స్పందించే లారెన్స్ ఈసారి స్పందించకపోవడంపై మొదట్లో అంతా ఆశ్చర్యపోయారు. అయితే దాని వెనుక మరో కారణం ఉందని లారెన్స్ విరాళం ప్రకటించాకే అందరికి తెలిసింది.చేతికందాల్సిన డబ్బు ఆలస్యం కావడంతోనే లారెన్స్ ఆలస్యంగా స్పందించారు. తాను తదుపరి చేయబోయే సినిమాకు సంబంధించి అడ్వాన్స్ అందగానే మూడు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించాడు.