న్యూఢిల్లీ : అస్సాం సిఎం హిమంత బిశ్వశర్మ చట్టవిర్ధుమైన కార్యక్రమాల్లో నిమగమై ఉన్నారని, ఆ దోపిడీని బాహ్య ప్రపంచం నుంచి దాచేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రముఖ సీనియర్ నాయ్యవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ”హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఒక్క చట్టవిరుద్ధమైన, అక్రమ కార్యకలాపాల్లో ఉంటున్నది. ప్రత్యేకించి పౌరులను అక్రమంగా బంగ్లాదేశ్కు, దేశం బయటకు పంపించివేస్తున్నది. ప్రజలను తమ సొంత భూముల నుంచి తరలించేస్తున్నది. వారి ఇళ్లను కూల్చివేస్తున్నది. వ్యవసాయపరంగా మంచి ఉత్పాదకతను అందించే ఆదివాసీల భూములను అదానీ గ్రూపుతోపాటు ఇతర కంపెనీలకు అక్రమంగా కట్టబెట్టేందుకు యత్నిస్తున్నది. రాష్ట్రంలో పూర్తిగా దోపిడీ జరుగుతోంది. దానిని సిఎం దాచాలనుకుంటున్నారు. అందుకే స్వతంత్ర వ్యక్తులను ఆయన నిరోధిస్తున్నారు” అని అన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి విదేశీ శక్తులతో కలిసి రాష్ట్రాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రశాంత్భూషణ్తోపాటు కాంగ్రెస్, జమాత్ – ఎ- ఇస్లామీ- హింద్, మేధావులు హర్ష మందర్, వజాహాత్ హబీబుల్లాతోపాటు పలువురిపై అంతకుముందు హిమంత బిశ్వ శర్మ విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన ప్రశాంత్ భూషణ్.. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి వస్తున్న ఇలాంటి వారిని చూసి హిమంత సర్కారు ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. సీనియర్ జర్నలిస్టులపై రాష్ట్రప్రభుత్వం దేశద్రోహం కేసులు బనాయించటాన్ని విమర్శించారు.