అమరావతి: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. క్యూలైన్లో ఉన్న వారికి అయిదు గంటలు దాటాక కూడా ఓటు వేసే అవకాశం ఇచ్చారు. ఏలూరు కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థల్లోని 581 డివిజన్లు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లోని 1,633 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,213 డివిజన్లు/వార్డుల్లో కలిపి 77,73,231 మంది ఓటర్లున్నారు. 2,123 వార్డులకు 490 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 7,915 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరిలో పురుష ఓటర్లు 38,25,129 మంది కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 39,46,952. ట్రాన్స్జెండర్లు 1150 మంది ఉన్నారు. మొత్తం 7,549 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2,320 అత్యంత సమస్యాత్మక, 2,468 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఇప్పటికే పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఏకగ్రీవమయ్యాయి.