కరోనా వైరస్ మీద పోరాటం లో తెలుగు సినిమా పరిశ్రమ స్పందించినట్లుగా దేశంలో మరే ఫిలిం ఇండస్ట్రీ స్పందించలేదన్నది వాస్తవం. మిగతా ఇండస్ట్రీల కంటే ముందు మన సినీ తారలు విరాళాల దిశగా ముందడుగు వేశారు. భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు. దీనికి తోడు మన సెలబ్రెటీలు కరోనాపై అవగాహన పెంచడంలో సేవా కార్యక్రమాలు చేపట్టడంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమను ముందుండి నడిపిస్తున్నారీ విషయంలో. తాజాగా కరోనా మీద అవగాహన పెంచే దిశగా చిరు ఆధ్వర్యంలో ఒక పాట కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో లో చిరుతో పాటు నాగార్జున వరుణ్ తేజ్ సాయిధరమ్ తేజ్ కూడా కనిపించారు. జనాలకు మంచి సందేశం ఇచ్చారు. ఈ వీడియో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వరకు వెళ్లింది. దీనిపై ఆయన స్పందించారు. మోడీ తెలుగులో టాలీవుడ్కు కృతజ్ఞతలు చెప్పడం విశేషం. ఈ వీడియోలో కనిపించిన నలుగురికీ పేరు పేరునా ఆయన ధన్యవాదాలు తెలిపాడు. ‘‘చిరంజీవి గారికీ నాగార్జున గారికీ వరుణ్ తేజ్ కీ సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం’’ అని తన ట్వీట్లో మోడీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి తన ట్విటర్ ఖాతా వేదికగా మోదీ ప్రశంసపై స్పందించారు. ‘మీ ప్రశంసకు ధన్యవాదాలు మోదీ గారు. మనదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు మీరు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.ఇలాంటి మహాకార్యంలో మేము మా వంతుగా చిన్న సాయం చేశాం. సంగీత దర్శకుడు కోటి, మా అందరి తరఫున మీకు నా ధన్యవాదాలు’ అని చిరు ట్వీట్ చేశారు.
చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం. #IndiaFightsCorona https://t.co/01dO5asinD
— Narendra Modi (@narendramodi) April 3, 2020