ఆటలే అస్త్రాలు

ఆటలే అస్త్రాలు

అమరావతి: కరోనా బాధితులకు చికిత్సలో అధికారులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. బాధితుల్లో మనోధైర్యం నింపేందుకు ఆటలను అస్త్రంగా వాడుతున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం రామచంద్రాపురంలోని కోవిడ్ కేర్ సెంటర్లో సుమారు 50 మంది బాధితులు ఉన్నారు. మొన్నటివరకు వీరిలో చాలామంది వ్యాధి వచ్చిందన్న మనోవేదనతో కుమిలిపోయేవారు. ఆహారం కూడా సరిగా తీసుకోలేక పోయేవారు. దీన్ని గమనించిన అక్కడి ప్రత్యేక అధి కారి, నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు బాధితుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు వారి మనస్సును ఆటల మీదకు మళ్లించారు. వ్యాధి ఉందన్న భావన మనస్సులో నుంచి పోయి ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించారు. బాధితులు ఆడుకునేందుకు క్యారమ్స్, చెస్, వైకుంఠపాళి, దాయాలు, తదితర ఆట వస్తు వులను సమకూర్చారు. మూడు పూటల భోజనం అనంతరం బాధితులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆడుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో నాలుగు రోజుల నుంచి బాధితులు ఆటల్లో నిమగ్నమైపోయారు. కోవిడ్ కేర్ సెంటర్లో ఆటలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో కంటే బాధితులు ఉత్సాహంగా ఉంటున్నారు. వారి ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోందని శ్రీనివాసరావు తెలిపారు.
బుర్రకథ.. యోగా..
కోవిడ్ రోగులకు స్వాంతన కలిగించేందుకు శ్రీకాకుళం జిల్లాలో అధికారులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండల పరిధిలోని పాత్రుని వలస కోవిడ్ కేర్ సెంటర్లో గురువారం బుర్రకథ ప్రదర్శించారు. రోగుల్లో మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలిగించేందుకు వినోద భరిత కార్యక్రమాలతోపాటు ఉదయం పూట యోగా నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి రవి కుమార్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos