అనుకోకుండా ఓ కేసులో పట్టుబడ్డ ఓ జేబుదొంగ ఆస్తులు చూసి పోలీసులు కళ్లు తేలేశారు.అతడి నేరచరిత్ర,విలాసవంతమైన జీవితం చూసి అవాక్కయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ జిల్లా అర్ణి ప్రాంతానికి చెందిన థానేదార్ సింగ్ కుశ్వ అలియాస్ రాజు చిన్న వయసులో రైల్వే ప్లాట్ ఫారాలపై స్వీట్లు విక్రయిస్తూ, ఆపై సిగరెట్లు, తంబాకు వ్యాపారానికి మారాడు. తనకు పరిచయమైన జేబు దొంగలను చూసి, రైళ్లలో చోరీకి అలవాటు పడ్డాడు. 2006లో బ్లేడ్ తో జేబులు కత్తిరించడంలో సిద్ధహస్తుడైన చంద్రకాంత్ తో ఏర్పడిన పరిచయం అతన్ని మార్చివేసింది. 2007లో ఓ మారు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. ఆపై 2009 వరకూ సంపాదించిన డబ్బుతో ఆగ్రాలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి, అదే సంవత్సరం పెళ్లి చేసుకుని తిరిగి హైదరాబాద్ కు వచ్చాడు.చందానగర్ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అదే సమయంలో తన గ్యాంగ్తో కలిసి దొంగతనం చేసే క్రమంలో ఔరంగాబాద్ పోలీసులపై బ్లేడ్తో దాడి చేసి అక్కడినుంచి పరారై నేరుగా ఆగ్రా చేరుకున్నాడు. అప్పటి నుంచి పలు నేరాలకు పాల్పడిన కుశ్వ సోమవారం తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక రాజు పట్టుబడిన విధానం కూడా సినీ పక్కీలోనే జరిగింది. గత నెల 26న బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద అతను నిలబడివుండగా, ఆర్పీఎఫ్ పోలీసులు అనుమానం వచ్చి వివరాలు తెలుసుకునేందుకు వెళ్లారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో తన బైక్ ను అక్కడే వదిలేసి పరిగెత్తాడు. ఈ క్రమంలో కిందపడడంతో, అతని ఎడమచేయి విరిగింది. అయితే, నెల రోజులుగా బైక్ అక్కడే ఉండటంతో పోలీసులు దానిపై దృష్టి పెట్టారు. సోమవారం నాడు మరో వ్యక్తి సాయంతో బైక్ ను తీసుకెళ్లేందుకు బేగంపేటకు వచ్చిన రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వాహనం కూడా దొంగిలించినదేనట. ఇప్పటి వరకు 400పైగా నేరాలకు పాల్పడినట్లు థానేదార్సింగ్ కుశ్వ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ నేరాలన్నీ కేవలం రైళ్లలో చేసినవే కావడం గమనార్హం. ఆయా చోరీల్లో నిందితుడు రూ.2 కోట్ల వరకు నగదు, ఆభరణాలు దొంగిలించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.విచారణలో నిందితుడి లగ్జరీని సికింద్రాబాద్ ఎస్పీ అనూరాధ విస్తుపోయారు.చందానగర్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నెలకు రూ. 30 వేలు అద్దె ఇస్తూ, నివసిస్తున్న రాజు, తన ఇద్దరు పిల్లలనూ లక్షల ఫీజు చెల్లించి, ఓ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివిస్తున్నాడు. లెక్కలేనన్ని ఆస్తులున్నాయి. భార్యకు కిలోకు పైగానే బంగారు ఆభరణాలున్నాయి. పోలీసులు ఇంటికి వెళ్లిన సమయంలో నగదు రూపంలోనే రూ. 13 లక్షలు దొరికింది. చోరీ సొమ్ముతో అత్యంత జల్సా జీవితాన్ని గడుపుతున్నాడీ ఘరానా దొంగ.అన్నట్టు మహారాష్ట్రలోని పూణెలో ఓ మారు పట్టుబడిన రాజును, ఎరవాడ జైలుకు తరలించగా, ముంబై పేలుళ్ల దోషి అజ్మల్ కసబ్ ను ఉరి తీసిన సమయంలో అక్కడే ఉన్నాడట.