ఈనెల 20వ తేదీన బెంగళూరు మహానగరం పరిసరాల్లో ఆకాశం నుంచి వినిపించిన భీకర శబ్దాలు తమిళనాడులోని తిరుప్పూరు ప్రజలను కూడా హడలెత్తించాయి. తిరుప్పూరు, కంగేయం, పల్లాదం, అరుళ్ పురం, అవినాశిపాళయం, పొంగలూరు, కోండువై, అనుప్పరపాళయం ప్రాంతాల్లో ఈ తీవ్రస్థాయి ధ్వనులు వినిపించాయి. ఆకాశం బద్ధలైందా అనేంతగా పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక ఇళ్లలోంచి బయటికి పరుగులుపెట్టారు.దీనిపై జిల్లా అధికార యంత్రాంగం వివరణ ఇచ్చింది. భారత్ అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం తేజస్ ను సూలూర్ ఎయిర్ ఫోర్స్ కేంద్రం నుంచి ప్రయోగాత్మకంగా నడిపి చూశారని, ఆ యుద్ధ విమానం సృష్టించిన ధ్వనులే ప్రజలను భయకంపితులను చేశాయని అధికారులు తెలిపారు.తేజస్ యుద్ధ విమానాన్ని భారత్ దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇది నాలుగో తరం సూపర్ సోనిక్ కంబాట్ ఎయిర్ క్రాఫ్టుల్లో అతి తేలికైన విమానం. ధ్వని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించడం ద్వారా తేజస్ శత్రుదేశాల రక్షణ వ్యవస్థల నుంచి సులువుగా తప్పించుకోగలదు. ఇది సూపర్ సోనిక్ వేగాన్ని అందుకునే సమయంలోనే ఆకాశం చిల్లులు పడేలా భారీ శబ్దాలు వినిపిస్తాయి. దీన్నే ‘సోనిక్ బూమ్‘ అంటారు.