ఢిల్లీ : వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ, తనిఖీ సమయంలో వాటిని ట్రాఫిక్ సిబ్బందికి చూపించకపోతే భారీ జరిమానాలు తప్పవు. అటువంటి సందర్భాల్లో వాహన చోదకులు కాస్త సహనాన్ని ప్రదర్శించాలని పంజాబ్కు చెందిన సునీల్ సంధూ అనే పోలీసు సూచిస్తున్నారు. జరిమానాగా విధించిన (చలానా) మొత్తాన్ని చెల్లించడానికి 15 రోజుల గడువు ఉంటుంది. ఈ సమయంలో వాహనానికి సంబంధించిన పత్రాలన్నీ అధికారులకు సమర్పిస్తే సరి. భారీ జరిమానాల నుంచి బయటపడవచ్చు. అలాంటి సందర్భాల్లో రూ.వంద మాత్రమే నామమాత్రపు జరిమానా విధిస్తారని ఆయన వివరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి రావడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు పడుతున్నాయి. జరిమానా దాదాపుగా పది రెట్లు పెరిగింది. ఇంట్లో పత్రాలను ఉంచి, అత్యవసర పనుల మీద బయటకు వచ్చినప్పుడు ట్రాఫిక్ పోలీసులకు దొరికితే, రూ.22 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అన్ని పత్రాలు ఉండి కూడా చాలా మంది భారీ జరిమానాలు చెల్లిస్తున్నారని, అలాంటి వారు ఓపికగా వ్యవహరిస్తే పెద్ద మొత్తాన్ని ఆదా చేయవచ్చని సంధూ వివరించారు.