చేదెక్కిన చీనీ ధర

చేదెక్కిన చీనీ ధర

అనంతపురం : ఆత్మకూరు చీనీ సాగు కష్టతరంగా మారిందని రైతులు వాపోతున్నారు. అనంతపురం జిల్లాలోని చీనీ కాయలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి చీనీ కాయల సాగు చేసే రైతుల పరిస్థితి నేడు దయనీయంగా మారిపోయింది. మూడు సంవత్సరాల నుంచి చీనీ చెట్లు విపరీతమైన తెగులు కారణంగా ఎండిపోతున్నాయి. మరోవైపు వీటిని కాపాడుకోవడానికి విపరీతమైన పెట్టుబడి పెట్టి ఆ మేరకు దిగుబడులు రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా నియోజవర్గంలోని రాప్తాడు, ఆత్మకూరు. కనుగానిపల్లి రామగిరి చెన్నై కొత్తపల్లి అనంతపురం రూరల్‌ మండలాలలో దాదాపు 25 వేల ఎకరాల్లో చీనీ పంట సాగులో ఉంది. పెరగని చీని ధరలు ప్రస్తుతం కోత దశలో ఉన్న చీనీ కాయలకు ధరలు ఏమాత్రం పెరగకపోవడంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలలో ధరలు టన్ను కాయలు రూ.40 నుంచి 50 వేలు వరకు పలికాయి. అలాంటిది ప్రస్తుతం టన్ను రూ 20 నుంచి రూ. 25 వేలు మాత్రమే ఉంది. దీనికి తోడు ఈ ఏడాది వాతావరణంలో మార్పులు కారణంగా చీనీ కాయలు ఎక్కువ భాగం మంగు రావడంతో ధరలు మరింత తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. తెగులుతో ఎండిపోతున్న చెట్లు, మూడు సంవత్సరాల నుంచి చీనీ చెట్లకు విపరీతమైన తెగుళ్లు వ్యాపించడంతో వాటి నివారణ కోసం వేల రూపాయల ఖర్చు పెట్టినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా వేరు కుళ్ళు, పులుసు పురుగు తెగులు కారణంగా చెట్లు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి. చీనీ కాయలకు నల్లి ఆశించడంతో కాయలు (మంగు) నల్లగా మారిపోతున్నాయి. తోటల తొలగింపు.. చీనీ సాగులో నష్టాలు వస్తుండడంతో రైతులు తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ముగ్గు చూపుతున్నారు. దశాబ్దకాల కిందట అనంతపురం జిల్లాలోని రామగిరి ఆత్మకూరు కనగానపల్లి మండలంలో చీనీ సాగు ప్రధానంగా ఉండేది. సాగు భారం కావడంతో చాలామంది రైతులు వాటిని తొలగించి అరటి, మొక్కజన్నతో పాటు ఇతర ప్రత్యాయ పంటల సాగుకు ఉపక్రమించారు. కొత్తగా చీనీ తోటల ఏర్పాటుకు రైతులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. గతంలో రైతులే చీని మొక్కల నర్సరీల సైతం ఏర్పాటు చేసి కర్ణాటక, తెలంగాణ ప్రాంతానికి విపరీతంగా సరఫరా చేసేవారు. ప్రస్తుతం నర్సరీలు సైతం కనుమరుగయ్యాయి. ప్రభుత్వం నుంచి ఆదరణ కరువు ప్రభుత్వం నుంచి చీనీ సాగుకు ఆదరణ కరువైందని రైతులు చెబుతున్నారు. గతంలో పాత తోటల పునరుద్ధరణ పథకం కింద రైతులకు ప్రోత్సాహం ఉండేది. ప్రస్తుతం వాటికి ప్రభుత్వం మంగళం పాడడంతో పాటు చీనీ చెట్లు చనిపోతున్న వాటికి ఇన్సూరెన్స్‌ రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos