పాక్ ఆక్రమిత భాగాలే తదుపరి లక్ష్యం..

పాక్ ఆక్రమిత భాగాలే తదుపరి లక్ష్యం..

భారత్ పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత రోజులుగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దు వెంబడి అగ్గి రాజేసేందుకు దాయాది దేశం కుట్రలు పన్నుతోంది. వివాదాస్పద గిల్గిత్-బాల్టిస్తాన్ ను దానికి వేదికగా చేసుకుంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ వ్యూహాలు పన్నుతున్నారు. భారత ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు . పూర్వ కశ్మీర్లో అంతర్భాగంగా ఉన్న బాల్టిస్తాన్ ప్రాంతాన్ని సంపూర్ణ ప్రావిన్స్ గా మార్చి తన చేతిలో తీసుకోవాలని వ్యూహాలు పన్నుతున్నారు. భారత హెచ్చరికల్ని తుంగలో తొక్కి వివాదాస్పద ప్రాంతంలో పర్యటించిన ఇమ్రాన్.. అక్కడ ఎన్నికల నిర్వహిస్తున్నామని ప్రకటించి భారత్ సార్వభౌమత్వానికే సవాల్ విసిరారు. దీనితో ఇప్పుడు సరికొత్త వివాదం మొదలైంది.అవిభాజ్య కశ్మీర్లో అంతర్భాగంగా ఉన్న బాల్టిస్తాన్ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అధికారం పాక్ ప్రభుత్వానికి లేదని భారత్ వాదిస్తోంది. ఈ మేరకు దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ దేశ భూభాగంలో అంతర్భాగమైన గిల్గిత్ బాల్టిస్తాన్ ను పాకిస్తాన్ దొంగదారిలో ఆక్రమించుకుందని అక్కడి నుంచి తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీచేశారు. ప్రొవెన్షియల్ హోదా ఇస్తామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన తరుణంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఏడు దశాబ్దాల నాటి వివాదం మళ్లీ రాజుకుంది. 1947 దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఆక్రమించిన 78114 చదరపు కిలోమీటర్ల కశ్మీరంలో ఉత్తరాన ఈ భూభాగం ఉంది. వివాదాస్పదమైన ఈ ప్రాంతాన్ని ఇన్నాళ్లూ పాకిస్తాన్ పాలనాపరమైన అవసరాల కోసం వాడుకుంది. ఇప్పుడు ఏకంగా ఆ ప్రాంతాన్ని సంపూర్ణ ప్రావిన్స్ గా మార్చి నవంబర్ 15న ఎన్నికల్ని నిర్వహించడానికి సిద్ధమవు తోంది.గిల్గిత్ బాల్టిస్తాన్ ను ప్రావిన్స్ గా మార్చి రాజకీయంగా పట్టు సాధించడానికి పాక్ చేస్తున్న కుయుక్తుల్ని ఎట్టి పరిస్థితిల్లోనూ సహించబోమని భారత్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపింది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా పాక్ అడుగు ముందుకు వేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ హెచ్చరికలు చేసింది. పీఓకేలోని ప్రతీ అంగుళం భూమి భారత్ కే చెందుతుందని స్పష్టం చేసింది. అయితే కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఆ ప్రాంతంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ మరింత పట్టుసాధించింది. పీఓకే ను సైతం స్వాధీనం చేసుకోవాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే గిల్గిట్ బాలిస్తాన్ పై తాజా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ స్వాధీనం చేసుకున్న భూభాగాలను ఆక్రమించుకోవడం తమ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos