ఎన్టీఆర్ కుమారుడు నటరత్న బాలకృష్ణ స్వయంగా నిర్మించి,తన ప్రధాన పాత్రలో నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం బాలకృష్ణ కెరీర్లో మాత్రమే కాదు తెలుగు చిత్ర పరిశ్రమలో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోనుంది.గతనెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మహానాయకుడు మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్తో పరాజయం దిశగా పరుగులు తీసింది.రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా మహానాయకుడు కేవలం రూ.4.7 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది.భారీ మాస్ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ చిత్రానికి ఈ వసూళ్లు అత్యంత అవమానకరం.అనువాద చిత్రాల స్థాయిలో కూడా వసూళ్లు సాధించలేక మహానాయకుడు చతికిలబడిపోవడం బాలయ్యకు, నందమూరి అభిమానులకు చేదువార్తే.సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు వల్ల డిస్ట్రిబ్యూటర్లు రూ.50 కోట్లు నష్టపోవడంతో రెండవ భాగాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. అయినప్పటికీ ఫలితంలో మాత్రం ఎటువంటి తేడా లేదు.మహానాయకుడు కూడా డిజాస్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లకు ఒరిగిన ప్రయోజనం శూన్యం.మార్చ్8వ తేదీ నుంచి కొత్త చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో మహానాయకుడిని అన్ని థియేటర్ల నుంచి ఎత్తేయనున్నట్లు తెలుస్తోంది.టికెట్లు ఉచితంగా ఇస్తామన్నా కూడా మహానాయకుడిని చూడడానికి ప్రజలు నిరాసక్తి చూపుతున్నారని అందుకే చిత్రాన్ని ఎత్తేస్తున్నామంటూ థియేటర్ల యజమానులు తెలుపుతున్నారు..