వాషింగ్టన్:అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారిని మరో భారతీయుడు దాడి చేసి హతమార్చిన ఘటన టెక్సాస్లోని ఆస్టిన్ ప్రాంతంలో ఒక బస్సులో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల మేరకు భారతీయ సంతతికి చెందిన అక్షరు గుప్తా (30) హెల్త్- టెక్ స్టార్టప్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. మే 14వ తేదీన టెక్సాస్లో ఓ బస్సులో ప్రయాణిస్తుండగా బస్సులో వెనక కూర్చొన్న గుప్తాపై మరో భారతీయుడు దీపక్ కండేల్ దాడి చేసి హతమార్చాడు. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గుప్తాను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే అతడు మృతి చెందాడు. ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోకపోయినా కండేల్ దాడి చేసినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా బయటపడిందని, వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నామని, అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అక్షరు గుప్తా తన మామలా కనిపించడం వల్లే తాను అతనిని కత్తితో పొడిచానని నిందితుడు పోలీసులకు పేర్కొనడం గమనార్హం. అక్షరు పెన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లను కలిశారు.