
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో శుక్రవారం భారీ ఎత్తున
నామినేషన్లు దాఖలయ్యాయి. శని, ఆదివారాలు సెలవు కావడం, శుక్రవారం మంచి ముహూర్తం ఉండడంతో
పలు పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా నామినేషన్లు వేశారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు తరఫున
చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్ దాఖలైంది. కడప జిల్లా పులివెందులలో వైకాపా అధ్యక్షుడు
జగన్మోహన్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిటర్నింగ్
అధికారులకు నామినేషన్లను సమర్పించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు భారీగానే నామినేషన్లు
దాఖలయ్యాయి. నిజమాబాద్లో తెరాస అభ్యర్థి కవిత, నల్గొండలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
కుమార్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. ఆంధ్రాలో గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా
అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట తల్లి భువనేశ్వరి, సతీమణి
బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ ఉన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. విజయవాడ లోక్సభ స్థానం తెదేపా
అభ్యర్థిగా కేశినేని నాని, గుంటూరు లోక్సభ స్థానానికి గల్లా జయదేవ్, శ్రీకాకుళం తెదేపా
అభ్యర్థిగా కింజారపు రామ్మోహన్ నాయుడు, అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ స్థానానికి
పరిటాల శ్రీరామ్, అరకు లోక్సభ స్థానానికి తెదేపా అభ్యర్థిగా వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్
నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.