అల్లర్లను బోధించటం దేనికి?

అల్లర్లను బోధించటం దేనికి?

న్యూఢిల్లీ : ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ డి.పి సక్లానీ గుజరాత్ అల్లర్లు, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన హింసను 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి తొలగించటాన్ని సమర్థించారు. కొన్నింటిని సెలెక్టివ్గా ప్రస్తావించటం మంచిది కాదని నిపుణుల కమిటీ భావించిందని ఆయన అన్నారు. ”మనం పాఠశాల పాఠ్యపుస్తకాల్లో అల్లర్ల గురించి ఎందుకు బోధించాలి? మనం సానుకూల పౌరులను సృష్టించాలనుకుంటున్నాం. హింసాత్మక, అణగారిన వ్యక్తులను కాదు. అయోధ్య విభాగంలోని సవరణలు నిపుణుల అభిప్రాయంపై ఆధారపడి ఉన్నాయి. వివాదంపై సుప్రీంకోర్టు 2019 తీర్పునకు అనుగుణంగా ఉన్నాయి” అని ఆయన చెప్పారు. అయోధ్య అంశానికి సంబంధించి 12వ తరగతి పుస్తకంలోని 8వ అధ్యాయంలో నాలుగు నుంచి రెండు పేజీల వరకు కుదించారు. గత వారం మార్కెట్లోకి వచ్చిన ఈ సవరించిన పాఠ్యపుస్తకం మాత్రం బాబ్రీ మసీదు పేరును ప్రస్తావించ లేదు. దానిని ”మూడు గోపురాల నిర్మాణం” అని పిలుస్తూ, గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు బీజేపీ రథయాత్ర, కరసేవకుల పాత్ర, డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో మత హింస, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనతో సహా మునుపటి వెర్షన్ నుంచి చెప్పే వివరాలను తొలగించింది.బాబ్రీ మసీదు కూల్చివేత, 2002 గుజరాత్ అల్లర్ల తరువాత జరిగిన మత హింసకు సంబంధించిన కంటెంట్ను విస్మరించటంపై ఆయన మాట్లాడుతూ.. ”మన దేశంలో చాలా మతపరమైన అల్లర్లు జరిగాయి. కొన్నింటిని సెలెక్టివ్గా పేర్కొనటం మంచిది కాదనీ, పాఠశాలల్లో చరిత్రను వాస్తవాలు చెప్పటానికే బోధిస్తున్నారనీ, దానిని యుద్ధ భూమిగా మార్చకూడదని నిపుణుల కమిటీ అభిప్రాయ పడింది” అని తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన సంఘటనలు, దాని తదనంతర పరిణామాలపై ఇతర వివరాలను ఎందుకు వదిలిపెట్టారని అడిగిన ప్రశ్నకు.. ”కొత్త కంటెంట్ను ( సుప్రీంకోర్టు తీర్పుపై) ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos