ముంబై: మదర్ డెయిరీ పాల ధరను భారీగా పెంచేసింది . అన్ని రకాల ఉత్పత్తులపై రూ.2 మేర ధరలు పెంచినట్లు మదర్ డెయిరీ బుధవారం ఉదయం తెలిపింది. పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 30 అమల్లోకి రానున్నాయి. తాజా పెంపుతో టోన్డ్ మిల్క్ (బల్క్ వెండెడ్ మిల్క్) లీటర్ ధర రూ.2 పెరిగి రూ.54 నుంచి రూ.56కు చేరింది. ఫుల్ క్రీమ్ పాలు ధర లీటరుకు రూ.69కి పెరిగింది. ఇక ఆవుపాల ధరలు లీటరుకు రూ.57కి, డబుల్ టోన్డ్ పాల ధర లీటరు రూ.51కి చేరింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మదర్ డైరీ అత్యధిక స్థాయిలో పాలను అమ్ముతోంది. ఆ నగరంలో రోజుకు సుమారు 35 లక్షల లీటర్ల పాలను సరఫరా చేస్తోంది. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో పాలను సరఫరా చేస్తోంది. చివరిసారి మదర్ డెయిరీ పాల ధరలను గతేడాదిన జూన్లో పెంచిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 పెంచింది.