ముంబయికి ఈ మ్యాచులోనూ కలిసి రాలేదు. ఫలితంగా టీ20 మెగా టోర్నీలో వరుసగా ఆరో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. లఖ్నవూ జట్టుతో జరిగిన మ్యాచులో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. దీంతో లఖ్నవూ జట్టు నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబయి బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (37), డెవాల్డ్ బ్రెవీస్ (31), తిలక్ వర్మ (26), కీరన్ పొలార్డ్ (25) రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (6), ఓపెనర్ ఇషాన్ కిషన్ (13), ఫేబియన్ అలెన్ (8), జయదేవ్ ఉనద్కత్ (14), మురుగన్ అశ్విన్ (6) పరుగులు చేశారు. బుమ్రా (0), టైమల్ మిల్స్ (0) నాటౌట్గా నిలిచారు. లఖ్నవూ బౌలర్లలో అవేశ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. జేసన్ హోల్డర్, రవి బిష్ణోయ్, మార్కస్ స్టొయినిస్, దుష్మంత చమీర తలో వికెట్ పడగొట్టారు.