కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభలో గురువారం ఆమె మాట్లాడుతూ బీజేపీ విద్వేషాన్ని వ్యాపింపజేస్తోందని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా జాబితాలపై బీజేపీ గందరగోళం సృష్టిస్తోందన్నారు. కోల్కతాలోని రాజా బజార్ నుంచి ముల్లిక్ బజార్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో టీఎంసీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వయంగా తనకు తన తల్లి జన్మస్థలం కానీ, పుట్టిన రోజు కానీ గుర్తు లేవని ఆమె చెప్పారు. ‘నేనే ఈ వివరాలను చెప్పలేనపుడు, మీరు ఎలా చెప్పగలుగుతారు?’ అని ప్రశ్నించారు. ఈ జాబితాలపై బీజేపీ నేతలు అబద్ధాలు చెప్తున్నారన్నారు. గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. కర్ణాటక వంటి చోట్ల నిరసనకారులు ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి సమయంలో బెంగాల్ హింసాత్మకంగా మారిందని ఆరోపించడానికి సిగ్గు లేదా? అంటూ బీజేపీ నేతలపై మండిపడ్డారు. తన సభకు ప్రజల మద్దతు ఉందని, రోజులు గడుస్తున్న కొద్దీ, నిరసనల్లో పాల్గొనేవారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. నిరసన భాష తనకు బాగా తెలుసునని చెప్పారు. తాను విద్యార్థి దశ నుంచి నిరసనల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. కళాశాల ముఖద్వారం వద్ద, రహదారులపైనా తాను నిరసనల్లో పాల్గొన్నట్లు తెలిపారు.