ట్యుటికోరిన్ : అక్రమంగా భారత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారనే ఆరోపణపై మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అదీబ్ అబ్దుల్ గఫూర్ ను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని ట్యుటికోరిన్ ఓడ రేవులో ఆయనను అరెస్టు చేశారు. టగ్ బోటులో ప్రయాణిస్తూ, సిబ్బందిలో ఒకరుగా చెప్పుకొని అక్రమంగా వచ్చేందుకు ఆయన ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా ఆయన వచ్చారని, అక్రమంగా దేశంలోకి వచ్చే అగత్యం ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నామని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయమై మాల్దీవుల ప్రభుత్వంతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకుంటామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.