ముంబై:భారత దిగుమతులపై 50 శాతం టారిఫ్లు అమల్లోకి రావడంతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ పరిణామం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీయడంతో ఆరంభ ట్రేడింగ్లోనే కీలక సూచీలు ఒత్తిడికి గురయ్యాయి.ట్రేడింగ్ ప్రారంభమయ్యాక 9.30 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 900 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ సుమారు 200 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. టారిఫ్ల తక్షణ ప్రభావం మార్కెట్ విశ్వాసాన్ని దెబ్బతీసిందని, అయితే ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే సంస్కరణలు, విధానపరమైన చర్యలు సమీప భవిష్యత్తులో మార్కెట్లకు మద్దతు ఇవ్వవచ్చని నిపుణులు ప్రాయపడుతున్నారు. నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ స్మాల్క్యాప్, నిఫ్టీ మిడ్క్యాప్ సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ ఆటో సూచీ 0.37 శాతం లాభపడి ట్రెండ్కు భిన్నంగా నిలిచింది. అయితే, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, పీఎస్యూ బ్యాంక్ వంటి కీలక రంగాలు నష్టాలను చవిచూశాయి.ప్రస్తుత వాణిజ్య, దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో చేపట్టనున్న జపాన్, చైనా పర్యటనలపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఆసియాలోని ఇతర మార్కెట్లలో జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి లాభాల్లో ఉండగా, హాంకాంగ్, తైవాన్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.