న్యూ ఢిల్లీ:పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడుల తర్వాత దాయాది దేశం సరిహద్దులో కాల్పులకు దిగింది. ఎస్ఓసీ వెంబడి ఉన్న గ్రామాలపై ఆర్టిలరీ, షెల్లింగ్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో 38మందికి గాయాలైనట్లు వెల్లడించారు. మృతులంతా పూంచ్ జిల్లాకు చెందినవారని అధికారులు వెల్లడించారు. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో 10మంది గాయపడ్డారు. మరో ముగ్గురు రాజౌరీ జిల్లాలో క్షతగాత్రులయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్- పాకిస్థాన్లో టెర్రరిస్ట్ క్యాంపులపై మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేపట్టింది. దీంతో సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. అమాయక ప్రజలను పాకిస్థాన్ బలిగొందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. దీనికి బదులు తీర్చుకుంటామని చెప్పింది.