హోసూరు : కృష్ణగిరి జిల్లా సూలగిరి యూనియన్లోని నెరిగం గ్రామంలో సంచార జాతులు నివసిస్తున్న కాలనీలో మౌలిక వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని యూనియన్ చైర్పర్సన్ లావణ్య హేమనాథ్ అధికారులను ఆదేశించారు. సూలగిరి సమీపంలోని నెరిగం గ్రామంలో సుమారు వందకు పైగా సంచార జాతి కుటుంబాలు నివస్తున్నాయి. కాలనీలోని ఇళ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొన్నాయి. కాలనీలో మౌలిక వసతులు లేకపోవడం సూలగిరి చైర్పర్సన్ లావణ్య దృష్టికి వచ్చింది. దీంతో ఆమె నెరిగం గ్రామంలోని కాలనీలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో ఇండ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని, తమకు పక్కా ఇళ్లు నిర్మించి, మౌలిక వసతులు కల్పించాలని చైర్పర్సన్ లావణ్యను కోరారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ, కాలనీలో ఇళ్ల మరమ్మతులకు చర్యలు చేపట్టాలని, అదేవిధంగా కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చైర్పర్సన్ లావణ్య వెంట జిల్లా కౌన్సిలర్ వెంకటాచలం, సూలగిరి బిడిఓ విమల్, ఎడిఎంకె పార్టీ నాయకులు వున్నారు.