న్యూ ఢిల్లీ : లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసుపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్నసుప్రీంకోర్టు నియమిత కమిటీ సిఫారసు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు శరాఘాతంగా మారింది. ఆయన కుమారుడు, ఈ కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిలును రద్దు చేయాలని ఈ కమిటీ సిఫారసు చేసినట్లు సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఆశిష్ మిశ్రా బెయిలును రద్దు వ్యాజ్యంపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. ఆశిష్ బెయిలు రద్దు చేయాలని తాను నియమించిన కమిటీ సిఫారసు చేసిందని, దీనిపై వైఖరిని సోమవారం నాటికి తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లఖింపూర్ ఖేరీలో 2021 అక్టోబరులో జరిగిన హింసాకాండలో ఎనిమిది మరణించారు, వీరిలో నలుగురు రైతులు. బాధితుల కుటుంబ సభ్యులు ఆశిష్కు బెయిలు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ మహేశ్ జెఠ్మలానీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శికి ఈ లేఖలు చేరలేదని చెప్పారు. ఈ లేఖలు తనకు చేరలేదని అదనపు ప్రధాన కార్యదర్శి చెప్పారని తెలిపారు. దీంతో సిట్ నివేదికలను పరిశీలించాలని, ఏప్రిల్ 4నాటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది.