జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పడానికి కసరత్తులు చేస్తున్న తెరాస అధినేత కేసీఆర్ ప్రస్తుతం దృష్టి మొత్తం లోక్సభ ఎన్నికలపై కేంద్రీకరించారు.తెలంగాణలోని 16 లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా నిర్దేశించుకున్న కేసీఆర్ అందుకు సంబంధించి కార్యాచరణ ముమ్మరం చేశారు.రాష్ట్రంలోని 16 ఎంపీ నియోజకవర్గాల్లో సర్వే చేపట్టిన కేసీఆర్ సర్వేల ఆధారంగా మొదట ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహిరాబాద్, మెదక్,భువనగిరి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలు నగేశ్,కల్వకుంట్ల కవిత, వినోద్కుమార్,బీబీ పాటిల్,కొత్త ప్రభాకర్రెడ్డి,బూర నర్సయ్యగౌడ్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో వారినే తిరిగి ఆయా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులుగా బరిలో దించడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.నేడు లేదా శనివారం లోపు ఆరుగురు అభ్యర్థులతో మొదటిజాబితా ప్రకటించిన అనంతరం ఈనెల 22వ తేదీన మిగిలిన పది నియోజకవర్గాలకు అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.మిగిలిన పది నియోజకవర్గాల్లో కూడా సర్వేలు చేయిస్తున్న కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అభ్యర్థుల ఎంపికలో ఏచిన్న తప్పిదం జరిగినా లోక్సభ స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉండడంతో సర్వేలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం..