హైదరాబాద్ : ‘సీఏఏ, ఎన్పీఆర్పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై సభలో ఒకరోజు ప్రత్యేక చర్చ చేపట్టాలి. నేను మా ఊరిలో సొంతింటిలో పుట్టాను. మా ఊరిలో అప్పుడు ఆస్పత్రి లేదు. నాకు బర్త్ సర్టిఫికెట్ కూడా లేదు. నాకే ధ్రువీకరణ పత్రం లేదంటే.. మా నాన్న సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కోరినట్లు సీఏఏపై ప్రత్యేకంగా చర్చిద్దాం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో కేసీఆర్ మాట్లాడారు. సీఏఏ బిల్లును పార్లమెంట్లో మేం వ్యతిరేకించాం. శాసనసభలో దీనిపై చర్చ జరగాల్సిందే. మన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అన్నది వేరే విషయం. కానీ, దేశాన్ని కుదిపేస్తున్న ఈ అంశంపై శాసనసభ చర్చించాల్సిన అవసరముంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో సుమారు 40మందికి పైగా మంది చనిపోయారు. మన రాష్ట్ర ప్రజల మనోభావాలు, వారి ఆలోచనలను కేంద్రానికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు.