న్యూ ఢిల్లీ: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు సుప్రీం కోర్టు చురకలు వేసింది. తనపై నమోదైన క్రిమినల్ డిఫమేషన్ కంప్లయింట్ ను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. కంగనా తన పిటిషన్ను ఉపసంహరించుకోవాలని, ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దాంతో కంగనా రనౌత్ సుప్రీంకోర్టులో దాఖలుచేసిన తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. 2021లో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఆందోళన సందర్భంగా మహిందర్ కౌర్ అనే వృద్ధ మహిళను కించపర్చేలా రీట్వీట్ చేశారు. ఆమె రూ.100 కిరాయికి వస్తుందని తన రీట్వీట్లో పేర్కొన్నారు. దాంతో మహిందర్ కౌర్ పరువునష్టం కేసు వేశారు.దాంతో కౌర్ ఫిర్యాదును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కంగనా ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆమె పిటిషన్ను తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆమెకు చీవాట్లు పెట్టింది. ‘మీ వ్యాఖ్యలకు అర్థం ఏమిటి..? మీది సింపుల్ రీట్వీట్ కాదు. మీరు మీ సొంత కామెంట్స్ చేశారు. మసాలా జోడించారు’ అని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్ నాథ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. దాంతో తన క్లయింట్ ఆ రీట్వీట్పై క్లారిఫికేషన్ ఇచ్చారని కంగనా తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ క్లారిఫికేషన్ ట్రయల్ కోర్టుకు ఇవ్వండని ధర్మాసనం సూచించింది. కంగనా పంజాబ్కు వెళ్లే పరిస్థితి లేదని న్యాయవాది చెప్పగా.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరవచ్చని కోర్టు పేర్కొంది. న్యాయవాది మరేదో వాదన చేయబోతుండగా.. ‘ఆమె ట్వీట్పై మా స్పందన కోరే ప్రయత్నం చేయకండి’ అని న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది.