ఢిల్లీ : హైకోర్టు న్యాయమూర్తి బంగ్లాలో భారీగా నగదు పట్టుబడింది హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో ఇటీవలే అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన నగరంలో లేరు. దీంతో కుటుంబ సభ్యులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఆ తర్వాత బంగ్లాలో పెద్ద మొత్తంలో నగదును గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొలీజియం సిఫార్సు మేరకు జస్టిస్ యశ్వంత్ వర్మపై బదిలీ వేటు వేశారు. ఆయన్ని అలహాబాద్ హైకోర్టు కు బదిలీ చేసినట్లు సంబంధితన వర్గాలు తాజాగా వెల్లడించాయి. కాగా, యశ్వంత్ వర్మ గతంలో అలహాబాద్లోనే పనిచేశారు. 2021 అక్టోబర్లో ఢిల్లీకి వచ్చారు. అయితే, జస్టిస్ వర్మను బదిలీ చేయడం వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింటుందని, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని కొలీజియంలోని కొంతమంది న్యాయమూర్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం నేపథ్యంలో జస్టిస్ వర్మ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వారు కోరారు. మరోవైపు జస్టిస్ వర్మపై దర్యాప్తు, అభిశంసన చర్యలు ప్రారంభించేందుకు కూడా చర్చలు జరుగుతున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.